రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 11 వేల మంది ఆంధ్రా ఉద్యోగులు అమరావతికి తరలిపోయారు. వీరు ఉద్యోగ రీత్యా అమరావతికి వెళ్లినప్పటికీ ఓటు హక్కు మాత్రం హైదరాబాద్లోనే ఉంది. స్థానికత సమస్యల వల్ల చాలా తక్కువమంది మాత్రమే ఓటు హక్కును ఏపీకి మార్చుకున్నారు. మరోవైపు తెలంగాణలో తమ పిల్లలు చదువుకుంటుండటంతో హైదరాబాద్లో ఓటు ఉంటేనే మంచిదని ఎక్కువమంది భావించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈ 11 వేల మంది ఉద్యోగుల ఓట్లు అనేక నియోజకవర్గాల్లో కీలకంగా మారనున్నాయి.
సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్లో ఎక్కుగా స్థిరపడిన ప్రాంతాలు… వనస్థలిపురం, ఎల్బీనగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, అమీర్పేట, ఎస్ ఆర్ నగర్, లింగంపల్లి, చందానగర్ మొదలైనవి. ఇవన్నీ శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్, జూబిలీ హిల్స్, ఖైరతాబాద్, సనత్ నగర్ నియోజక వర్గాల పరిధిలోకి వస్తాయి. అందువల్ల కనీసం ఏడెనిమిది నియోజక వర్గాల్లో సీమాంధ్ర ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి.

ఆంధ్రా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం డిసెంబరు 7న వారికి సెలవు ప్రకటించింది. కొంత మంది ఏపీకి ఓటు హక్కు బదిలీ చేసుకున్నా.. ఇంకా సచివాలయం, అసెంబ్లీ, మండలిలోని దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు.. 200 హెచ్వోడీ కార్యాలయాల్లో సుమారు 8 వేల మందికి తెలంగాణలోనే ఓటు హక్కు ఉంది. వీరితోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సుమారు 2 వేల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్ టైం ఉద్యోగులు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.
ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లపై కూడా ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. చంద్రబాబు, టీడీపీ మీద అభిమానంతో వీరి ఓట్లన్నీ ప్రజాకూటమి అభ్యర్థులకే పడతాయని ఆయా అభ్యర్థులు గట్టిగా భావిస్తున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలలాగే సీమాంధ్ర ఉద్యోగులు కూడా తమకే మద్దతు ఇస్తారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.