విరాట్ కోహ్లి.. నిస్సందేహంగా ప్రపంచంలో గొప్ప ఆటగాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో ఘన విజయాలు, రికార్డులు నమోదు చేసిన, ఇంకా చేస్తున్న క్రికెటర్. అయితే ఇటీవల కాలంలో నోటి దురుసో, మరొకటో గానీ ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. అభిమానుల మీద, తోటి విదేశీ ఆటగాళ్ల పట్ల కోహ్లీ ప్రవర్తన అభ్యంతరకరంగా మారాయి.

కోహ్లీ ఓవర్రేటెడ్ ఆటగాడనీ, తనకు కోహ్లీ ఆటకంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్ల ఆటంటేనే ఇష్టమని ఇటీవల ఓ నెటిజన్ ప్రస్తావించగా, దానికి కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. అలాగైతే నువ్వు ఇండియాలో ఎందుకు, వేరేచోటనే ఉండాల్సింది అని జవాబు ఇచ్చాడు. దీంతో తీవ్రంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు.
తాజాగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో పెయినీ, కోహ్లీ మధ్య సంభాషణ సమయంలో కోహ్లీ బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన కూడా విమర్శలకు దారితీసింది. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా కోహ్లీని ప్రపంచంలో అత్యంత గొప్ప ఆటగాడనీ, అత్యంత చెత్త ప్రవర్తన గల ప్లేయరనీ విమర్శించాడు. తాను ఇలా మాట్లాడి ఎక్కడికీ వెళ్లడం లేదనీ, ఇండియాలోనే ఉంటానని చురక అంటించాడు. అతని ప్రవర్తన వల్ల అతని ఆటలోని గొప్పదనం మరుగునపడుతుందని వ్యాఖ్యానించాడు. అయితే గతంలో అనేక వివాదాలకు కేంద్రంగా ఉన్న నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదుగానీ, అదే సమయంలో కోహ్లీ ప్రవర్తనను కూడా వెనుకేసుకురాలేం. తాజాగా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా కోహ్లీ ప్రవర్తనను తప్పుబట్టాడు.

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో పెయినీ, కోహ్లీ సంభాషణ తర్వాత అంపైర్ కూడా కోహ్లీని పిలిచి ప్రశాంతంగా ఉండమని చెప్పినట్టు వార్తలొచ్చాయి. పైకి సుహృద్భావ సంభాషణలాగే కనిపించినప్పటికీ కోహ్లీ బాడీ లాంగ్వేజ్ అలా లేదు. ఆటలో అగ్రెసివ్నెస్ మంచిదేకానీ, తోటి ఆటగాళ్లపై అగ్రెసివ్గా ఉండటం వల్ల స్పోర్టివ్ స్పిరిట్ దెబ్బతింటుందేమో. గతంలో ఇలాంటివి ఎక్కువగా చేసే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది.