బాబు కూట‌మి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన మాయావ‌తి

బీజేపీకి వ్య‌తిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌తో కూడిన కూటమిని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న చంద్ర‌బాబు నాయుడు ఆశ‌ల‌పై యూపీలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు నీళ్లు చ‌ల్లాయి. కాంగ్రెస్ పార్టీ లేకుండానే మాయామ‌తి, అఖిలేష్ యాద‌వ్ వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం సీట్ల స‌ర్దుబాటు చేసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో 5 సీట్ల‌కే ప‌రిమిత‌మైన ఎస్పీ ఈసారి ఎలాగైనా యూపీపై ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నిస్తుంది. ఇందులో భాగంగానే వైరం వ‌దిలేసి ఎస్పీ, బీఎస్పీ ఏకం అయ్యాయి. అయితే ఇందులో కాంగ్రెస్‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డంతో అక్క‌డ మ‌హా కూట‌మి విఫ‌ల‌మైన‌ట్టే భావించాలి.

ఎస్పీ, బీఎస్పీ మ‌ధ్య అవ‌గాహ‌న ప్ర‌కారం చెరో 37 సీట్ల‌లో పోటీ చేస్తారు. మిగిలిన 6 సీట్ల‌ను త‌మ మిత్ర‌పక్షాల‌కు వ‌దిలేస్తారు. అజిత్‌సింగ్ నాయ‌క‌త్వంలోని ఆర్ ఎల్ డీ కూడా మాయా, అఖిలేష్ కూట‌మిలో చేరే అవ‌కాశం ఉంది. ఇది ఒక ర‌కంగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాల‌కు దెబ్బే. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందే కాంగ్రెస్‌తో అన్ని బీజేపీయేత‌ర పార్టీలు జ‌ట్టుక‌ట్టాల‌న్న ప్ర‌య‌త్నాల‌కు ఇది విఘాత‌మే. అయితే కేసీఆర్ యూపీ ప‌రిణామాల‌ను స్వాగ‌తించే అవ‌కాశం ఉంది. కాంగ్రెస్‌, బీజేపీ యేత‌ర ఫ్రంట్ అంటున్నారు కాబ‌ట్టి ఆ మేర‌కు ఇది కేసీఆర్ వాద‌న‌కు తాత్కాలికంగానైనా యూపీ ప‌రిణామం బ‌లం చేకూర్చుతుంది.

mayavathi and naidu

యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో జ‌యాప‌జ‌యాలు ఢిల్లీ రాజ‌కీయాల‌పై త‌ప్ప‌కుండా ప్ర‌భావం చూపిస్తాయి. అయితే ఎన్నిక‌ల త‌ర్వాత ఈ రెండు పార్టీలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయ‌నే విష‌యంలో ప్ర‌స్తుతం స్ప‌ష్ట‌త లేదు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబ‌ట్టి స‌హ‌జంగా కాంగ్ర‌స్‌కే మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశం ఉంది.

మిగ‌తా ప్రాంతీయ పార్టీలు కూడా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ఇదే విధానాన్ని అవలంభించే అవ‌కాశాలు ఉన్నాయి. అస‌లు టీడీపీనే ఏపీలో కాంగ్రెస్‌తో క‌లిసి వెళ్లుతుందా లేదా అనేది ఇంకా స్ప‌ష్టం కాలేదు. మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఒంట‌రిగానే పోటీ చేయ‌డానికి అవ‌కాశం ఉంది. ఒక్క మ‌హారాష్ట్రలో ఎన్సీపీ త‌ప్ప ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌తో ఏ బీజేపీయేత‌ర పార్టీ కూడా క‌ల‌వ‌డానికి సుముఖంగా లేవు. త‌మ సొంత బ‌లంపైనే ఆశ‌లు పెట్టుకుంటున్నాయి.