అమ‌రావ‌తిలో అస‌లేం జ‌రుగుతోంది? ఇప్పుడే తెలియాలంటే…?

గత నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి చాలా అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. విదేశీ క‌న్స‌ల్టెన్సీల స‌హాయంతో మాస్ట‌ర్ ప్లాన్‌లు, గ్రాఫిక్‌ల ద్వారా స‌చివాల‌యం, అసెంబ్లీ భ‌వ‌నాల న‌మూనాల విడుద‌ల‌, అంబేద్క‌ర్ స్మృతివ‌నం, ఎన్టీఆర్ విగ్ర‌హం న‌మూనా… ఇవ‌న్నీ ఉత్తుత్తి మాట‌లే అని అక్క‌డ అస‌లు ఏమీ జ‌ర‌గ‌లేద‌నీ, ప్ర‌చారం త‌ప్ప గ్రౌండ్ లెవెల్‌లో అభివృద్ధి సున్నా అని విమ‌ర్శ‌లు బాగా వ‌స్తున్నాయి. దీనికి జ‌వాబుగా ప్ర‌భుత్వం, తెలుగుదేశం పార్టీలు అమ‌రావ‌తి సంద‌ర్శ‌న‌కు ప్ర‌జ‌ల‌ను తీసుకెళ్తున్నాయి. ఉచితంగా భోజ‌నాలు పెట్టించి, ర‌వాణా సౌక‌ర్యంతో అమ‌రావ‌తి అంతా తిప్పి చూపిస్తున్నారు.

Amaravati development

అమ‌రావ‌తి లేదా విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్ర ప్ర‌దేశ్ అభివృద్ధి గురించి మాట్లాడేట‌ప్పుడు అంద‌రం కూడా గుర్తుంచుకోవాల్సింది…. క‌నీసం ఒక్క సిక్స్ లేన్‌ రోడ్డు కూడా లేని స్థితిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఏర్ప‌డింది. పేరుకు చెప్పుకోవ‌డానికి కూడా ఒక్క ప్ర‌ముఖ ఐటీ కంపెనీ లేదా మాన్యుఫ్యాక్చ‌రింగ్ కంపెనీ, ఇత‌ర ప్రాజెక్టులు 2014 నాటికి అమ‌రావ‌తిలో, ఆంధ్ర‌లో లేవు. ఈ ప‌రిస్థితి నుంచి ఇవాళ అనేక కంపెనీల‌కు చిరునామాగా ఏపీ మారింది. వీటిలో ప్ర‌ముఖంగా చెప్పుకోవాల్సింది కియా కార్ల కంపెనీనే. 13000 కోట్ల పెట్టుబడితో అనంత‌పురంలో నిర్మించిన ఈ కంపెనీ ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి నిలువెత్తు చిరునామా అవుతుంద‌న‌డంలో సందేశం లేదు. అంతేగాదు, హీరో, ఇసుజు, అశోక్ లేలాండ్‌లు కూడా ఏపీలో ప్లాంట్‌లు పెడుతున్నాయి.

మ‌రో ముఖ్య అంశం… బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌ల‌కు ఐటీ కంపెనీలు రావ‌డానికి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. అన్నీ రెడీగా అక్క‌డ ఉన్నాయి. కానీ అతీగతీ లేని అమ‌రావ‌తికి, వైజాగ్‌కు ఐటీ కంపెనీలు రావ‌డం మామూలు విష‌యం కాదు. ఈ ప‌రిస్థితి నుంచి ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ ప‌రిశ్ర‌మ‌లు ఒక్కొక్క‌టి ముందుకొస్తున్నాయి. వీటిలో మాక్రోమాక్స్, కార్బన్, రెడ్‌మీ, జియో, నిప్పాన్, బెర్జ‌ర్‌, అపోలో, గూగుల్ డెవలపింగ్ సెంటర్, ఫాక్స్‌కాన్‌, పిఐ సెంటర్, హెచ్‌సీఎల్ క్యాంపస్, టిసిఎల్, టెంపుల్ టౌన్, వోల్టా, మైండ్ ట్రీ, విప్రో, జోహో, మెడ్‌టెక్ మొదలైనవి ఏపీలో ఇప్పుడు ఉన్నాయి. వీటిలో కొన్ని కార్య‌కాలాపాలు ప్రారంభించాయి. ఇది అభివృద్ధి కాదా?

అగ్ర స్థాయి ప్రైవేట్ విద్యా సంస్థలు:

తెలుగు విద్యార్థులు మంచి ఇంజినీరింగ్ కాలేజీల కోసం త‌మిళ‌నాడు పోతున్నారు. అమరావతిలో వీఐటీ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం, అమృతా మొదలైనవి వ‌చ్చాయి. హైదరాబాద్లో కూడా వీటికి క్యాంపస్‌లు లేవు. అలాంటిది అమ‌రావ‌తిలో క్యాంప‌స్‌లు పెట్టాయి. మ‌రిన్ని టాప్ క్లాస్ విద్యాసంస్థ‌ల స్థాప‌న‌కు ఇది దోహ‌ద‌ప‌డ‌నుంది. అందువ‌ల్ల వాస్త‌వ ప‌రిస్థితులు తెలుసుకోకుండా అమ‌రావ‌తిలో లేదా ఏపీలో ఏమీ జ‌ర‌గ‌డం లేద‌న‌డం స‌రైంది కాదు. అనేక ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య ఈ మాత్రం అభివృద్ధి బీజాలు ప‌డ‌టం సానుకూల ప‌రిణామ‌మే క‌దా.