ఒకసారి వాయిదా పడిన మోదీ ఏపీ పర్యటన ఈసారైనా విజయవంతం అవుతుందా? ఈమధ్యనే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శ్రీకాకుళం పర్యటన ఘోరంగా విఫలమైంది. సభలో వందల సంఖ్యలో కూడా జనం లేకపోవడంతో అమిత్ షా సభను రద్దు చేసుకొని తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ చేదు అనుభవంతో బీజేపీ టెన్షన్లో ఉంది. ఏకంగా ప్రధాని పర్యటనే విఫలం అయిందంటే దేశవ్యాప్తంగా పరువు పోతుందనే ఒత్తిడిలో ఉంది. అమిత్ షా సభ లాగనే ప్రధాని సభకు కూడా పరాభవం తప్పదని టీడీపీ ధీమాగా ఉంది. దీనికి తనవంతుగా ప్రతి వ్యూహాలను కూడా సిద్ధం చేసింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఎంతో కొంత వ్యక్తిగత ప్రాజల్యం ఉన్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించాలని బీజేపీ భావిస్తుంది. అయితే టీడీపీ తెలివిగా అదేరోజు ఈ నియోజకవర్గాల నుంచి జనాన్ని మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టు సందర్శనకు తరలించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈమేరకు వందల సంఖ్యలో బస్సులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ఆదివారం మోదీ గుంటూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రారంభోత్సవాలు చేసి సాయంత్రం బహిరంగ సభలో మాట్లాడాల్సి ఉంది. ప్రారంభోత్సవాలకు ఇబ్బంది లేకపోయినా బహిరంగ సభపై టెన్షన్ ఉంది. టీడీపీ కార్యకర్తలు ఆటంకాలు సృష్టించకుండా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే జన సమీకరణే పెద్ద సవాలుగా మారనుంది.