లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. 2019 మార్చి మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్సభ ఎన్నికలు పలు దశల్లో జరగనున్నాయి.
సాధారణ ఎన్నికలు మొత్తం 9 దశల్లో జరిగే అవకాశం ఉంది. మార్చి 4 న మహాశివరాత్రి పండగ ఉంది. దీని తర్వాత ఎన్నికల తేదీలు విడుదల కావచ్చు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. ఎన్నికల షెడ్యూల్ మార్చి 8 వ తేదీకి రావడానికి అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిర్ణయాలన్నీ ఫిబ్రవరి నెలాఖరులోగా తీసుకోవాలని వివిధ మంత్రిత్వ శాఖలను సూచించింది.
ఏపీలో ఎన్నికల వేడి చాలా ముందునుంచే మొదలైంది. నాయకులు పార్టీలు మారడం ప్రారంభమైంది. టిడిపి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్య ఈసారి భారీ పోరాటం తప్పదు. రెండు పార్టీలు అధికారం పొందడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రకటించడంతోపాటు ప్రత్యేక హోదా మీద జాతీయ స్థాయిలో పోరాడుతుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీదనే ఎక్కువగా ఆధారపడుతోంది.