ఖమ్మంలో విచిత్ర సంఘటన జరిగింది. ఓట్లు వేసిన ప్రజలు ఓటు వేసినందుకు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని ఓ అభ్యర్థికి చెందిన నాయకుడిని నిలదీశారు. శుక్రవారం ఓటు వేసి పోలింగ్ మరుసటి రోజు శనివారం మొత్తం సదరు నాయకుడి ఇంటి వద్దనే వెయిట్ చేశారు. డబ్బుల ఇస్తానని వాగ్దానం చేసిన నాయకుడు కనిపించకపోయేటప్పటికి మరింత ఆవేదన చెందారు.
స్థానిక వేణుగోపాల నగర్లో ఈ సంఘటన జరిగింది. స్థానిక అభ్యర్థి ఒకరు 1280 మంది ఓటర్లను డబ్బుతో మభ్యపెట్టాడు. అందరికీ డబ్బులు ఇస్తానని తన అనుచరుడి ద్వారా అందరికీ డబ్బులు పంపించాడు. అయితే 600 మందికే డబ్బు చేరింది. మిగతావారికి సాయంత్రం డబ్బులు ఇస్తానని చెప్పిన అనుచరుడు పోలింగ్ తర్వాత పత్తాలేడు. దీంతో ఓటేసినవారు ఆందోళనకు దిగారు.
అనుచరుడు చెప్పిన చోటికి వెళ్లిన ఓటర్లు ఎంత సేపు ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో తీవ్రంగా హెచ్చరించారు. ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో, తమకు రావాల్సిన పైసలు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.